సీడి వివాదంలో లోకపాల్ కమిటీ కో-ఛైర్మన్ శాంతిభూషన్

సీడి వివాదంలో లోకపాల్ కమిటీ కో-ఛైర్మన్ శాంతిభూషన్





న్యూఢిల్లీ: అవినీతి నిరోధానికి ఏర్పాటయిన లోకపాల్ డ్రాఫ్టింగ్ కమిటీ తొలి సమావేశానికి ఒకరోజు ముందే కమిటీ సహా ఛైర్మన్‌పై ఓ వివాదం చెలరేగింది. లోకపాల్ కమిటీ సహా ఛైర్మన్, మాజీ న్యాయశాఖ మంత్రి శాంతిభూషన్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్, ఆ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్‌లతో మాట్లాడినట్లు భావిస్తున్న సీడి వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సీడీ కల్పితమని శాంతిభూషణ్, అమర్‌సింగ్ పేర్కొన్నారు. ఈ సీడి వ్యవహారంపై శాంతిభూషణ్ పోలీసు కేసు నమోదుచేశారు. ములాయంసింగ్‌కు సంబంధించిన న్యాయసంబంధ విషయంలో జ్యోకం చేసుకోవాలని కోరుతూ అమర్‌సింగ్ శాంతిభూషణ్‌న్ను కలిసినట్లు సీడీ సంభాషణల్లో నమోదయింది.

'ఇది నమ్మదగిన సీడీ కాదు. దీని రూపకర్త ఎవరో తెలిసే వరకూ ఇది కల్పితమైనదే. నేను గతంలో ములాయంతో చాలాసార్లు మాట్లాడాను. అయితే దీని గురించి మాట్లాడినట్లు గుర్తులేదు. నేనే ఈ సీడిని వెలుగులోకి తేస్తే, కనీసం నా సంభాషణను తొలగించేవాడిని కదా’ అని ఆయన అన్నారు.

సీడీ కల్పితమైనదని, ఆ ఇద్దరు నేతలతో తానెప్పుడూ మాట్లాడలేదని తను నమోదు చేసిన పోలీసు కేసులో శాంతిభూషణ్ పేర్కొన్నారు. ఓ జర్నలిస్టు ద్వారా ఈ సీడి వ్యవహారాన్ని తెలుసుకున్న ఆయన వెంటనే కేసు నమోదు చేశారు. ‘పరువునష్టం కల్పించేవిధంగా సీడీలో సంభాషణలు ఉన్నాయి. నన్ను కించపరిచి, ప్రతిష్టను దెబ్బతిసేందుకు ఈ సీడిని రూపొందించినట్లు కనబడుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.