వైఎస్‌ను పొగిడినా జగన్‌కే లాభం

వైఎస్‌ను పొగిడినా జగన్‌కే లాభం


 హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, అటు పీసీసీ నాయకత్వం గొంతులో వైఎస్‌ వెలక్కాయ అడ్డు పడుతున్నది. కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభకు జరిగే ఉప ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆకర్షణ శక్తి, ఆయన అమలు చేసిన పథకాల విషయంలో కాంగ్రెస్‌ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న కృత నిశ్చయంతో కాంగ్రెస్‌ నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమస్త బలగాలను కేంద్రీకరించి ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నా, ఫలితాలు అనుకూలంగా వస్తాయనే విషయంలో అనుమానాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నట్టు పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి.

వైఎస్‌ పథకాలు తమవే అని చెప్పుకుందామంటే జగన్‌ వర్గం నేతలు, వోటర్లు ఆ మాటలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రచారాన్ని మరింత ఉధృతం చేసే అవకాశం ఉంది. వైఎస్‌ తమవాడే అంటే మరి జగన్‌ను, ఆయన తల్లినీ పార్టీకి ఎందుకు దూరం చేసుకున్నారన్న ప్రశ్న జనం నుంచి ఎదురైతే కాంగ్రెస్‌ వద్ద జవాబు సిద్ధంగా లేదు. అలాగని జగన్‌ను విమర్శిస్తూ మాట్లాడితే మరింత వ్యతిరేకత పెరుగుతుందన్న భయం... అలా కాకుండా వైఎస్‌ పేరు లేకుండా ప్రచారంలోకి దిగుదామంటే ఏ ముఖం పెట్టుకు వచ్చారని జనం నిలదీస్తారన్న ఆందోళన....ఆ విధంగా కూడా జగన్‌ వర్గానికి అనుకూలంగా మారే ప్రమాదం....ఇన్ని అష్ట కష్టాలతో కాంగ్రెస్‌ నాయకత్వం, ముఖ్య మంత్రి మంత్రివర్గం సతమతం అవుతున్నది.

ఏ ఆలోచనలతో వెళ్తారు?
రెండు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయటానికి అనుకూలంగా కాంగ్రెస్‌ వద్ద ప్రత్యేకమైన ఆలోచనలేవీ లేవు. ఉన్నవి రెండే మార్గాలు...ఒకటి దివంగత వైఎస్‌ను, జగన్‌నూ వ్యతిరేకించటం, రెండవది వైఎస్‌ను ప్రశంసించి జగన్‌ను విమర్శించటం...ఈ రెండు వ్యూహాలూ కడప, పులివెందులలో పనిచేసే అవకాశాలు కనిపించటం లేదన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల నుంచే వస్తున్నాయి. అసలు కాంగ్రెస్‌ ఆలోచనా విధానం ఏమిటో ఇప్పటికీ మసకబారిన అద్దం మాదిరిగానే ఉంది. వైఎస్‌ అమలు చేసిన పథకాలన్నీ పార్టీ పథకాలే అని చెప్పి తప్పించుకునే అవకాశాలూ లేవు....అవి పార్టీ పథకాలైతే ఇప్పుడు చెబుతున్న వీరంతా ఆయన జీవించి ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తే పార్టీ వద్ద జవాబు లేదు.

కొత్త పథకాలేవీ?
ఇటు వైఎస్‌ మిగిల్చిపోయిన పథకాలు మినహా ఒక్క కొత్త పథకమూ కాంగ్రెస్‌ వద్ద కానీ, సర్కార్‌ వద్ద కానీ లేదు. ఎంతసేపు చెప్పినా జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్ళు, ఉచిత విద్యుత్‌, పేదలు, వికలాం గులకు పింఛన్‌, ఫీజు రీయంబర్స్‌మెంటు వంటి పేరు పొందిన పథకాలను ప్రచారం చేసుకోవల సిందే. ఇక్కడే కాంగ్రెస్‌కు మరోసారి తల బొప్పి కట్ట నున్నది. వైఎస్‌ మరణించిన తర్వాత ఈ పథకాలన్నీ అధ్వాన్నంగా నడుస్తున్నాయన్న ఆరోపణలు విపక్షం నుంచే కాకుండా స్వపక్షం నుంచి సైతం ఎదురవు తున్నాయి. పోనీ వీటన్నిటి అమలులో ఎనలేని కుంభకోణాలు చేసుకున్నాయని చెప్పుకోవాలను కుంటే, ఇప్పుడున్న మంత్రులే వైఎస్‌ హయాం లోనూ అధికారంలో ఉన్నారు. వారికి భాగస్వామ్యం లేదా అని జనం ప్రశ్నిస్తే తెల్లమొగం వేసే పరిస్థితి.

వైఎస్‌ను పొగిడినా జగన్‌కే లాభం
ఉప ఎన్నికలకు సన్నద్ధం చేసే ప్రయత్నంలో భాగంగా ఆదివారం ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ డీఎస్‌ పలువురు మంత్రులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. చివరకు తేలిందేమిటంటే ప్రసంగాలలో ఎక్కడా వైఎస్‌ను విమర్శించటం కానీ, ఆరోపణలు చేయటం కానీ చేయకూడదని ముఖ్యమంత్రి కరాఖండిగా చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అలాంటప్పుడు ఆయన అమలు చేసిన పథకాలను ఎలా స్వంతం చేసుకోవాలో తెలియక మంత్రులు, ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ అవన్నీ వైఎస్‌ పథకాలే అని చెప్పుకోవాలంటే ఆ వ్యూహమూ జగన్‌కే అనుకూలంగా మారుతుంది. వైఎస్‌ పథకాలే కాబట్టి ఆయన కుటుంబానికే వోట్లు వేయాలని జనం నిర్ణయించుకుంటే వారిని నియంత్రించే స్థాయి నాయకత్వానికి లేదన్నది నిర్వివాదం అని పార్టీ వర్గాలే బహిరంగంగా చెబుతున్నాయి.

మహిళలకు గాలం
స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సర్కార్‌ ఇటీవలే జీవో జారీ చేసింది. దాన్ని ఎరగా వేసి మహిళా వోట్లను అధికంగా లాగాలన్న ఆలోచనలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. అయితే వారి ప్రయత్నం ఏమేర ఫలిస్తుందన్నది ఎన్నికల ఫలితాలు తేలుస్తాయని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. అలాగే ఫీజు రీయంబర్స్‌మెంటు, ఇందిరమ్మ ఇళ్ళు వంటి పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ, అవి రెండూ భ్రష్టు పట్టి పోయాయని, తమను గెలిపిస్తే మళ్ళీ పేదల రాజ్యం తీసుకు వస్తామని జగన్‌ ఇప్పటినుంచే ప్రచారం మొదలెట్టారు. జనం ఆ హామీల పట్ల ఆకర్షితులవుతున్నట్టు కథనాలు వస్తున్నాయి.

దూరమవుతున్న స్థానిక నేతలు
ఇది ఇలా ఉంటే ఇటీవలే స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరిగిన ఉప ఎన్నికలో విజయం చేజిక్కించుకోలేక పోవటంలో కాంగ్రెస్‌ డొల్లతనం బయట పడింది. ఈ పరిణామం తర్వాత అప్పటి దాకా తటస్థంగా ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధుల వలస జగన్‌ వర్గంలోకి మరింత పెరిగినట్టు చెబుతున్నారు.

పరువు నిలిచేనా?
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగనున్న ఉప ఎన్నికలు ముఖ్యమంత్రికీ, మంత్రులకూ పెను సవాల్‌గా మారనున్నాయి. ఎన్ని శక్తులు ఒడ్డినా దివంగత వైఎస్‌కు బలమైన కంచుకోటగా ఉన్న కడపలో ఆయన వర్గం సహకారం లేకుండా విజయం సాధించటమన్నది దాదాపు అసాధ్యం అని పార్టీ వర్గాలు ఒకవైపు అనుకుంటుంటే మరోవైపు మంత్రులు మాత్రం గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరి ధీమా మాట ఎలా ఉన్నప్పటికీ ఒకవేళ ఓటమిపాలైతే అధిష్ఠానం వద్ద ఇప్పటికే భారీగా పోయిన కిరణ్‌ పరువు మరింత దిగజారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అదే జరిగితే రాజకీయాలలో ఎలాంటి మార్పులు వస్తాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు.